YS Sharmila: కోర్టులు మొట్టికాయలు వేస్తే కానీ సారుకు బాధ్యతలు గుర్తుకు రావు: షర్మిల

  • కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల
  • నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలనే సోయి రాదని మండిపాటు
  • దొర ఇచ్చేది లేదు.. కేంద్రం ఇచ్చింది ఇవ్వడని వ్యాఖ్య
Sharmila fires on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆమె మరోసారి ధ్వజమెత్తారు. కోర్టులు మొట్టికాయలు వేస్తే కానీ సారుకు బాధ్యతలు గుర్తు రావు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలనే సోయి రాదని అన్నారు. రైతుబంధును ఇచ్చి, పంట బీమాను ఎత్తేసిన దొర పుణ్యానికి, రెండేండ్లలో లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే కనీసం అణాపైసా సహాయం చేసింది లేదని మండిపడ్డారు. దొర ఇచ్చేది లేదని... కేంద్రం ఇచ్చింది ఇవ్వడని ఎద్దేవా చేశారు.

ఇక మొన్నటి వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకొంటామని ఉత్త చేతులతో ఊపుకొంటూ పోయివచ్చిన మీరు పరిహారం ఇస్తారంటే నమ్మాలంటారా? అని షర్మిల ప్రశ్నించారు. రైతుబంధు వారోత్సవాలు చేయడం తెలుసు కానీ... రైతులకి పరిహారం ఇవ్వడం తెలియదా దొరగారు? అని అడిగారు. రైతులను ఆదుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని ట్వీట్ చేశారు.

More Telugu News