covid vaccine: పిల్లలకు కొవిడ్ టీకా ఇప్పించే విషయంలో వేచిచూసే ధోరణిలో కొందరు తల్లిదండ్రులు

Many Parents In Wait Watch Mode to vaccinate their kids
  • సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆందోళన
  • సమర్థతపైనా కొందరిలో సందేహాలు
  • పరిశీలించిన తర్వాత నిర్ణయించుకోవచ్చన్న యోచన
  • అవగాహన కల్పించిన తర్వాతే ఇవ్వాలని అభిప్రాయాలు
దేశంలో 15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం దేశవ్యాప్తంగా నిన్న మొదలైంది. తొలిరోజు (ఈ నెల 3న) టీకాల కార్యక్రమం సజావుగానే నడిచింది. కానీ, హైదరాబాద్ లో వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. దీనికి కారణం కొన్ని రోజులు వేచి చూద్దామనే ధోరణితో తల్లిదండ్రులు ఉండడమే. టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలపై వారిలో ఆందోళన నెలకొంది.

‘‘నా కుమార్తెకు టీకా ఇప్పిద్దామనే అనుకుంటున్నాను. కానీ ఒక నెల పాటు వేచి చూస్తాను. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కేసులు బయట పడతాయేమో చూడాలి. నా కుమార్తె ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతోంది. టీకా తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా మారకుండా చూసుకోవాల్సి ఉంది’’ అని ఓ తండ్రి తెలిపారు.

కోవిన్ పోర్టల్ పై రిజిస్టర్ చేసుకున్న తల్లిదండ్రుల్లో మరి కొందరు సైతం ఇదే రకమైన అభిప్రాయాలను మీడియా ముందు వ్యక్తం చేశారు. వీరు ఇంకా స్లాట్ లను బుక్ చేసుకోలేదు. కరోనా టీకాల సమర్థతను పరిశీలించిన తర్వాతే తమ పిల్లలకు టీకాలు తీసుకోవడంపై నిర్ణయం తీసుకోవాలని కొందరు భావిస్తున్నారు.

పిల్లలకు టీకాలపై అవగాహన, ప్రచార కార్యక్రమం నిర్వహించాలని టీకాలు ఇప్పిస్తున్న తల్లిదండ్రులు కొందరు సూచిస్తున్నారు. ‘‘తల్లిదండ్రులు, టీనేజర్లలో అవగాహన కల్పించిన తర్వాతే టీకాలు ఇవ్వాలి. అంతేకానీ బలవంతం చేయకూడదు’’ అని ఓ మహిళ చెప్పడం గమనార్హం.
covid vaccine
teenagers
telangana
Parents
wait mode

More Telugu News