Team India: దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టుకు టీమిండియా ప్లాన్ ఇదే..!

Team India planning for Centurion test
  • దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా
  • ఈ నెల 26 నుంచి తొలి టెస్టు
  • ఐదుగురు బౌలర్లతో బరిలో దిగనున్న భారత్
  • కోహ్లీ, రహానే, పుజారా ఫామ్ పై అనిశ్చితి

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ఈ నెల 26 నుంచి జరగనుంది. తొలి టెస్టు సెంచురియన్ వేదికగా ఆదివారం ప్రారంభం కానుంది. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానం పేసర్లకు అనువుగా ఉంటుందని ప్రతీతి. ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతోంది. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లను జట్టులో చేర్చేందుకు టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

సెంచురియన్ టెస్టు నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడాడు. టెస్టుల్లో ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్ చేయాలని ప్రతి జట్టు భావిస్తుందని, అందుకే ఐదుగురు బౌలర్ల ఎత్తుగడను తాము తప్పకుండా పాటిస్తామని తెలిపాడు. భారత జట్టు విదేశాల్లో ఆడిన ప్రతిసారి ఈ వ్యూహం ఫలితాన్నిచ్చిందని వివరించాడు. తుదిజట్టులో ఐదుగురు బౌలర్లు ఉంటే పనిభారం తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. తగినంత సంఖ్యలో బౌలర్లు ఉంటే వారిని చక్కగా వినియోగించుకోవచ్చని కేఎల్ రాహుల్ వివరించాడు.

కేఎల్ రాహుల్ వ్యాఖ్యలతో టీమిండియా కూర్పుపై స్పష్టత వచ్చింది. ప్రధాన బౌలర్లుగా షమీ, బుమ్రా, ఉమేశ్/ఇషాంత్, అశ్విన్, ఐదో బౌలర్ గా శార్దూల్ ఠాకూర్/సిరాజ్ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీమిండియా బ్యాటింగే కాస్త ఆందోళన కలిగిస్తోంది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఫామ్ లో లేరు. కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ జాలువారి సంవత్సరాలు గడుస్తోంది. కోహ్లీ చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్ పై శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు టెస్టుల్లో కోహ్లీ నుంచి స్థాయికి తగిన ఇన్నింగ్స్ రాలేదు.

రహానే పరిస్థితి మరీ దారుణం. ఇటీవల వైస్ కెప్టెన్సీ కోల్పోయిన ఈ ముంబయి ఆటగాడు.... దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో విఫలమైతే మరోసారి ఎంపిక కావడం కష్టమే. గత 12 టెస్టుల్లో రహానే సగటు 19.57 మాత్రమే.

రహానేతో పోల్చితే పుజారా పరిస్థితి కాస్తంత మెరుగు అని చెప్పాలి. పుజారా మరీ దారుణమైన ఫామ్ లో లేడు కానీ, పరుగులు సాధించేందుకు ఎక్కువ బంతులు ఆడుతుండడం మిగతా బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచుంతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పేస్ కు సహకరించే సఫారీ పిచ్ లపై కోహ్లీ, పుజారా, రహానే ఎలా ఆడతారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News