ZEE5: జీ5లో విశేష ప్రేక్షాదరణ పొందుతున్న 'రిపబ్లిక్'‌, 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'... హైదరాబాదులో సక్సెస్‌ మీట్‌

  • నిహారిక నిర్మాణంలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
  • వెబ్ సిరీస్ కు మంచి గుర్తింపు
  • సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ 
  • ఇటీవల జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం
zee5 success meet in Hyderabad

జీ5 ఓటీటీ యాప్ లో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్, రిపబ్లిక్ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. రిపబ్లిక్ చిత్రం సాయి తేజ్‌ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కింది. ఒక చిన్న ఫ్యామిలీ లవ్ స్టోరీలో సంగీత్‌ శోభన్‌, సిమ్రన్‌ జంటగా నటించగా... సీనియర్‌ నరేశ్‌, తులసి, ‘గెటప్‌’ శీను, ప్రమీల రాణి (భామ) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ను పింక్‌ ఎలిఫెంట్స్‌ పిక్చర్స్‌ పతాకంపై మెగా డాటర్‌ నిహారికా కొణిదెల నిర్మించడం విశేషం. మహేశ్ ఉప్పాల దర్శకత్వం వహించారు.

కాగా, రిపబ్లిక్, ఒక చిన్న ఫ్యామిలీ లవ్ స్టోరీ ఈ రెండూ జీ`5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, దూసుకుపోతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మెగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌ పేరుతో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ... "నాకు మంచి కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేయడం చాలా ఇష్టం. అందులో భాగంగా భారీ కమర్షియల్‌ సినిమాలు కూడా ప్రొడ్యూస్‌ చేసే అవకాశం ఫ్యూచర్‌లో ఉండొచ్చు. ఆడియెన్‌గా ఎలాంటి సినిమాలు చూడాలని అనుకుంటానో.. అలాంటి సినిమాలే నిర్మించాలని చూస్తా. జీ వాళ్ల దృష్టిలో కంటెంట్‌ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అది నేను దగ్గరగా చూశాను. నేను చేసిన ముద్దపప్పు ఆవకాయ, నాన్నకుచ్చి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మూడూ జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుండడం చాలా హ్యాపీగా ఉంది.

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సింగిల్‌ థ్రెడ్‌ స్టోరీ. ఈ క్రెడిట్‌ మా డైరెక్టర్‌ మహేశ్ గారు, రైటర్‌ మానస గారిదే. నాకు కథ చెప్పేటప్పుడే మహేశ్ గారు నన్ను ఆ కథతో కనెక్ట్‌ చేసి నడిపించారు. ప్రతి సీన్‌ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది.

రిపబ్లిక్‌ సినిమా చాలా ఆనెస్ట్‌ మూవీ. దేవా కట్టా గొప్ప డైరెక్టర్. క్లైమాక్స్‌ నాకు అద్భుతంగా అనిపించింది" అని వివరించారు.

దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ... "నాకు కూడా ఫ్యామిలీ స్టోరీస్‌ చేయాలని ఉంది. నా దగ్గర రెండు, మూడు కథలు ఉన్నాయి. వెన్నెల కూడా నేను అనుకున్న స్థాయిలో చేయలేదనిపిస్తుంది. వెన్నెల తర్వాత ప్రస్థానం కథ చెబితే కొందరు హీరోలు వెన్నెలకు కొద్దిగా యాక్షన్‌ కలిపి తీసుకురా అన్నారు. ప్రస్థానం తర్వాత అది తప్ప మరోటి ఊహించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. దాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి హీరోలు ఇంట్రస్ట్‌ చూపిస్తూ ఉంటారు.

ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఇంత పెద్ద రెస్పాన్స్‌ వస్తుందని మేం ముందే ఊహించాం. సినిమా మీద మాకు ముందు నుంచి చాలా నమ్మకం ఉంది. గతంలో ఓ ప్రతిఘటన, ఓ రేపటిపౌరులు వంటి కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాం. కానీ గత 15, 20 సంవత్సరాలుగా ఆ సెక్షన్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌ను కోల్పోయాం. అది మనం చేసిన తప్పే. ప్రేక్షకులకు మనం సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఉన్న కంటెంట్‌ను ఇస్తే తప్పకుండా ఆనందిస్తారు, ఆదరిస్తారు. మా ‘రిపబ్లిక్‌’ ఓటీటీలో గ్రాండ్‌ సక్సెస్‌ కావటానికి ప్రధాన కారణం.. జీ5 వారు ప్రమోట్‌ చేసిన విధానమే అని కన్‌ఫర్మ్‌గా చెప్పగలను.

రిపబ్లిక్‌ లోని ప్రతి మాట.. ప్రతి సన్నివేశం ప్రతి ఆడియెన్స్‌ చర్చించే విషయమే. ఈ కథ సమాజంలోని ఒక తీవ్ర సంఘర్షణ నుంచి పుట్టింది కాబట్టే అంతగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యింది. నెక్ట్స్‌ ఏ ఎమోషన్‌తో సినిమా చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు" అని వెల్లడించారు.

More Telugu News