Mohammed Azharuddin: వన్డే సిరీస్ కు కోహ్లీ, టెస్టులకు రోహిత్ శర్మ దూరమవడం ఊహాగానాలకు ఊతమిచ్చినట్టవుతుంది: అజర్

  • టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ
  • వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించిన సెలెక్టర్లు
  • రెండు ఫార్మాట్లలో రోహిత్ కు పగ్గాలు
  • టెస్టుల వరకు కోహ్లీ సారథ్యం
  • త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత్
Azharuddin opines on Team India developments

ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భారత్ వైఫల్యం చెందినప్పటి నుంచి జట్టులో లుకలుకలపై వార్తలు వస్తున్నాయి. కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకుంటున్నట్టు ప్రకటించగా, సెలెక్టర్లు ఏకంగా వన్డే కెప్టెన్సీ నుంచే తప్పించారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాకు కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించారు. త్వరలోనే టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది.

అయితే, గాయం కారణంగా టెస్టు సిరీస్ కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ ఫార్మాట్లో భారత జట్టుకు కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా, తాను దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ ఆడబోవడంలేదని కోహ్లీ పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. వన్డే ఫార్మాట్లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. ఈ పరిణామాలపై భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు.

"వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉండడం లేదని కోహ్లీ అంటున్నాడు. రాబోయే టెస్టు సిరీస్ కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఆట నుంచి విరామం తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ సమయం, సందర్భం చూసుకుని విరామం తీసుకుంటే బాగుంటుంది. ఒకరు ఒక ఫార్మాట్ నుంచి తప్పుకుంటే, మరొకరు మరో ఫార్మాట్ కు దూరమయ్యారు.  ఇప్పటికే సంక్షోభంపై అనేక ఊహాగానాలున్నాయి. తాజా పరిణామాలతో అవి మరింత పెరుగుతాయి" అంటూ అజర్ విశ్లేషించాడు.

కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నట్టు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.

More Telugu News