CM KCR: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ

  •  సింగరేణి గనుల వేలానికి కేంద్రం నిర్ణయం
  • కార్మిక సంఘాల సమ్మె పిలుపు
  • వేలం నిలిపివేయాలని ప్రధానిని కోరిన సీఎం కేసీఆర్
  • బొగ్గు అవసరాలకు విఘాతం ఏర్పడుతుందని వెల్లడి
CM KCR wrote PM Modi

ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గనులు ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పాదనతో దక్షిణాది రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలు తీర్చుతున్నాయని వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనుల్లో జీబీఆర్వోసీ-3, ఓసీ కోయగూడెం, కేకే-6, శ్రావన్ పల్లి కోల్ బ్లాక్ ల వేలాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు మూడ్రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని అన్నారు. 2014లో 5,661 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి విద్యుత్ వినియోగం 13,688 మెగావాట్లకు పెరిగిందని కేసీఆర్ వివరించారు. తాజాగా నాలుగు గనుల వేలంతో సింగరేణి గనుల పరిధిలో బొగ్గు అవసరాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ నాలుగు గనులను సింగరేణికే కేటాయించాలని, వేలం నిలిపివేతకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరారు.

More Telugu News