Omicron: ‘ఒమిక్రాన్’పై భయం వద్దు.. టెస్టుల నుంచి అది తప్పించుకోలేదు!

  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్ష
  • ఆర్టీ పీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల్లో ఒమిక్రాన్ పట్టుబడుతుందన్న కేంద్రం
  • విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా వేయాలన్న కేంద్రం
  • హాట్‌స్పాట్‌లను పర్యవేక్షించాలని సూచన
  • దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా లేదన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
Omicron variant doesnt escape RT PCR and RAT

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. అది కలిగించే తీవ్రతపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. దానికి ముందే అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న ఆయా దేశాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. ఒమిక్రాన్ అంత భయంకరమైనదేమీ కాదని కొందరు, అది చాలా డేంజరని మరికొందరు చెబుతుండడంతో ప్రజలు అయోమయం చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేసిన సూచన కొంత ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ టెస్టుల్లో దొరకదన్న ప్రచారాన్ని కొట్టివేసింది. ఇది ఆర్టీ పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల్లో బయటపడుతుందని, ఈ పరీక్షల ద్వారా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చని తెలిపింది. ఈ పరీక్షల నుంచి అది ఎంతమాత్రమూ తప్పించుకోలేదని స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌కు సంబంధించి దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా వెలుగు చూడలేదని, కాబట్టి రాష్ట్రాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచాలని సూచించింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ అధ్యక్షతన నిన్న అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కేసులు, చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాలు, అంతర్జాతీయ ప్రయాణ సలహాలను రాష్ట్రాలతో పంచుకున్నామన్న భూషణ్.. పోర్టులు, ల్యాండ్-బోర్డర్ క్రాసింగ్‌ల ద్వారా దేశంలో అడుగుపెట్టే అంతర్జాతీయ ప్రయాణికులపై కఠిన నిఘా ఉంచాలని రాష్ట్రాలకు సూచించారు. హాట్‌స్పాట్‌లను పర్యవేక్షించాలని రాష్ట్రాలను కూడా కోరినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ 'హర్ ఘర్ దస్తక్' టీకా ప్రచారాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించినట్టు చెప్పారు. అలాగే, మొదటి డోసును వందశాతం పూర్తి చేయడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. రెండో డోసు బ్యాక్‌లాగ్‌ను కూడా పూర్తి చేస్తామన్నారు.

కొవిడ్-19 కొత్త వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న పార్లమెంటుకు తెలిపారు. ఒమిక్రాన్ దేశంలో కాలుమోపకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

More Telugu News