Omicron: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌భావం.. విమాన ప్రయాణాలపై కేంద్ర స‌ర్కారు నిబంధ‌న‌లు ఇవే

  • సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సిందే
  • కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రం త‌ప్ప‌నిస‌రి
  • ద‌క్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి వ‌స్తే 7 రోజులు క్వారంటైన్
  • క‌రోనా టెస్టు ఫలితం వచ్చే వరకు  ఉండాల్సిందే
  • ఒమిక్రాన్ వేరియంట్ ఉంద‌ని తేలితే క‌ఠిన ఐసోలేష‌న్  
Omicron Alert New Rules For India Arrivals And Airports In 5 Points

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్త‌మైన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు దేశాలు దక్షిణాఫ్రికాతో పాటు ప‌లు దేశాల‌ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించాయి. ఇప్పుడు భార‌త్ కూడా అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువ‌చ్చింది.  

అంతర్జాతీయ ప్రయాణాలపై తీసుకున్న‌ కీలక నిర్ణయాలను ప్ర‌క‌టించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిబంధ‌న‌లు అమలులోకి వస్తాయి. విదేశాల నుంచి భారత్  కు వ‌చ్చే ప్ర‌తి ప్రయాణికుడు తమ 14 రోజుల ప్రయాణ వివరాల (సెల్ఫ్ డిక్ల‌రేష‌న్)ను స‌మ‌ర్పించ‌డంతో పాటు ప్రయాణానికి ముందు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని ఎయిర్ సువిధ పోర్టల్లో అప్ లోడ్ చేయాలని తెలిపింది.

ఈ రెండు నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే, ద‌క్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్ర‌యాణికులు భార‌త్‌లోని విమానాశ్ర‌యంలో దిగిన అనంత‌రం క‌రోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఆ టెస్టు ఫలితం వచ్చే వరకు అక్కడే ఉండాలని కేంద్ర మార్గ‌ద‌ర్శకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఎవరికైనా పాజిటివ్ గా తేలితే వారిని క్వారంటైన్ కు పంపుతారు. అత‌డిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉంద‌ని తేలితే క‌ఠిన ఐసోలేష‌న్ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. తీవ్ర ముప్పు ఉన్న ద‌క్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి వ‌చ్చిన వారికి నెగెటివ్ అని తేలిన‌ప్ప‌టికీ వారు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ల‌లో ఉండాల్సిందే. వారికి ఎమినిదో రోజు మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తారు.

ఒమిక్రాన్ ప్ర‌భావం లేని దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులకు ర్యాండమ్ గా టెస్టులు చేస్తారు. ఎవ‌రికైనా పాజిటివ్ నిర్ధార‌ణ అయితే క్వారంటైన్‌కు పంపుతారు. ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వ‌చ్చి నెగెటివ్ వ‌చ్చిన వారు కూడా 14 రోజుల పాటు త‌మ‌ ఆరోగ్య ప‌రిస్థితుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండి టెస్టులు చేయించుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది.

More Telugu News