Kollywood: సమస్యలు సృష్టిస్తున్నారంటూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న తమిళ సినీ నటుడు శింబు

Actor Simbu breaks into tears on stage
  • ఈ నెల 25న విడుదల కానున్న ‘మానాడు’
  • విలేకరుల సమావేశంలో శింబు కన్నీరు
  • ఓదార్చిన వేదిక మీది ప్రముఖులు
విలేకరుల సమావేశంలో తన సినిమా ‘మానాడు’ విశేషాలను పంచుకున్న కోలీవుడ్ ప్రముఖ నటుడు శింబు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న ప్రముఖులు అతడిని ఓదార్చారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిన్న చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ.. వెంకట్‌ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే ఆయన మరొకరితో ఒప్పందం చేసుకోవడంతో ఆలస్యం అయిందన్నారు.

ఇక 'మానాడు' సినిమాలో వినోదానికి కొదవ ఉండదన్నారు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని, ఇందులో ఎస్‌జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని అన్నారు. సినిమా విడుదల తర్వాత ఆయన మరో స్థాయికి వెళ్తారని పేర్కొన్నారు.

ఇలా అప్పటి వరకు సరదాగా మాట్లాడిన శింబు ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అయితే, ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని, తన సంగతిని మాత్రం మీరు (అభిమానులు) చూసుకోవాలని కోరారు. శింబు కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు ఆయనను ఓదార్చారు.

More Telugu News

Kollywood
Simbu
Tears
Maanaadu