Drushyam: 'రాంబాబు కేసు ఏటైనాది?'.. అంటూ ఉత్కంఠ‌భ‌రితంగా 'దృశ్యం-2'.. టీజ‌ర్ విడుద‌ల‌

  • వెంక‌టేశ్‌, మీనా హీరోహీరోయిన్లుగా దృశ్యం-2
  • కుటుంబాన్ని కేసు నుంచి కాపాడుకునే పాత్ర‌లో వెంకీ
  • ఓటీటీలోనే విడుద‌ల చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం
  • ఈ నెల‌ 25 నుంచి స్ట్రీమింగ్
Drushyam2 Teaser Out Now  Venkatesh Daggubati Meena

'రాంబాబు కేసు ఏటైనాది?' అంటూ ఆస‌క్తిరేపే ప్ర‌శ్న‌తో 'దృశ్యం-2' సినిమా టీజ‌ర్‌ను ఆ చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించిన 'దృశ్యం' సినిమా హిట్ కావ‌డంతో, దానికి సీక్వెల్ గా ఇప్పుడు 'దృశ్యం-2' సినిమా రూపుదిద్దుకుంటోన్న విష‌యం తెలిసిందే.

మలయాళ హీరో మోహన్ లాల్‌ నటించిన దృశ్యం-2 రీమేక్‌గా తెలుగులో అదే పేరుతో ఈ సినిమా నిర్మితమైంది. వెంకటేశ్ భార్య‌గా మీనా ఇందులో న‌టించారు. ఈ సినిమాలో రాంబాబు అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి పాత్ర‌లో వెంక‌టేశ్ నటించారు. హ‌త్య కేసు నుంచి, పోలీసుల విచారణ నుంచి త‌న కుటుంబాన్ని ఎలాగైనా స‌రే కాపాడుకోవాల‌ని త‌ప‌న ప‌డే వ్య‌క్తిగా వెంక‌టేశ్ క‌న‌ప‌డ‌తారు.

ఆరేళ్లుగా డిపార్ట్ మెంటును వేధిస్తోన్న ప్ర‌శ్న అంటూ 'దృశ్యం'లోని హ‌త్య‌ కేసును 'దృశ్యం-2'లోనూ ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఈ టీజ‌ర్‌లో చూపించారు. 'ఒరేయ్ చంటి, ఆయ‌న కేసు ఏటి అయినాదిరా? రాంబాబు కేసు ఏటైనాది స‌ర్?' అంటూ ఇద్ద‌రు మాట్లాడుకుంటున్న‌ట్లు డైలాగులు వినిపించారు. 'రాంబాబు అంటే వ‌రుణ్ కేసులో..' అంటూ పోలీసు అధికారి అంటాడు. అందుకు కానిస్టేబుల్ స్పందిస్తూ 'అవును స‌ర్ అత‌డే' అని చెబుతాడు.

టీజ‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠనింపే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు ఈ కేసును పోలీసులు ఛేదిస్తారా? ఈ సినిమాలోనూ కేసు నుంచి వెంక‌టేశ్ కుటుంబం త‌ప్పించుకుంటుందా? అన్న ఆస‌క్తిని ప్రేక్ష‌కుల్లో నింపారు. ఈ సినిమాకు జీతూ జోసఫ్‌ దర్శకత్వం వహించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు.

మలయాళ 'దృశ్యం-2' సినిమాను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల చేయ‌గా, తెలుగు 'దృశ్యం-2'ను కూడా అందులోనే విడుద‌ల చేస్తున్నారు. మొద‌ట‌, ఓటీటీలో విడుద‌ల‌ చేయబోమని, థియేటర్లలోనే విడుదల చేస్తామని ఆ సినిమా యూనిట్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే, చివ‌ర‌కు ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని ఆ సినిమా యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ (సీబీఎఫ్‌సీ) యూ సర్టిఫికెట్‌ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నెల‌ 25 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

More Telugu News