Ajinkya Rahane: న్యూజిలాండ్ తో తొలి టెస్టు కు కోహ్లీ దూరం... కెప్టెన్ గా రహానే

  • ఈ నెల 25 నుంచి రెండు టెస్టుల సిరీస్
  • రోహిత్ కు విశ్రాంతి
  • తొలి టెస్టుకు కోహ్లీ దూరం
  • రెండో టెస్టుకు జట్టులోకి రానున్న కోహ్లీ
Rahane will be captained Team India in first test against New Zealand

ఈ నెల 25 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే తొలి టెస్టుకు రెగ్యులర్ సారథి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తో తొలి టెస్టుకు భారత జట్టు కెప్టెన్ గా అజింక్యా రహానే వ్యవహరిస్తాడు. కోహ్లీ రెండో టెస్టులో ఆడతాడని, ఆ మ్యాచ్ లో అతడే నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా, రోహిత్ శర్మ సిరీస్ మొత్తానికి దూరమవుతాడని వివరించారు.

భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ వదులుకోవడంతో రోహిత్ శర్మ కొత్త కెప్టెన్ గా నియమితుడైన సంగతి తెలిసిందే. ఈ నెల 17 నుంచి టీమిండియా, కివీస్ మధ్య మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టీ20 సిరీస్ లో ఆడే భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. ఈ సిరీస్ ముగిసిన అనంతరం టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఇక, రోహిత్ తో పాటు టెస్టు సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్ కూడా దూరమవుతున్నారు. నెలల తరబడి బయోబబుల్ లో ఉన్న ఆటగాళ్లకు పనిభారాన్ని అనుసరించి విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించారు.

More Telugu News