Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా 'మమ్మీ' అంటూ అంతరాయం కలిగించిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

  • కరోనా గురించి లైవ్ లో జసిండా మాట్లాడుతుండగా నిద్ర లేచిన కూతురు
  • డాలింగ్... ఇంకా పడుకోలేదా? అంటూ కూతురుతో మాట్లాడిన జసిండా
  • అందరూ క్షమించాలంటూ నవ్వుతూ అన్న పీఎం
Daughter interrupts New Zealand PM Jacinda Ardern livestream

కరోనా పరిస్థితిపై ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ప్రసంగిస్తుండగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆమె మూడేళ్ల చిన్నారి కూతురు 'మమ్మీ' అంటూ అంతరాయం కలిగించింది. దీంతో ఆమె తన ప్రసంగాన్ని ఆపి... 'డాలింగ్... ఇంకా పడుకోలేదా? ఇది పడుకునే సమయం. పడుకో. ఒక నిమిషంలో నేను వస్తా' అని తన కూతురుకి చెప్పారు.

ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... అందరూ క్షమించాలని నవ్వుతూ అన్నారు. తన కూతురుకి నిద్రాభంగం అయినట్టుందని చెప్పారు. మీ పిల్లలెవరైనా నిద్రలో ఇలాగే లేస్తున్నారా? అని ప్రశ్నించారు. అయితే, తన కూతురుని చూసుకోవడానికి తన తల్లి ఉన్నారని చెప్పారు. తర్వాత 'మనం ఎక్కడదాకా వచ్చాం?' అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తల్లీకూతుళ్లకు చెందిన ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూసిన వారందరూ గొప్ప అనుభూతికి లోనవుతున్నారు. ఒక దేశ ప్రధాని అయివుండి తన కూతురిపై ఆమె చూపించిన ప్రేమను ప్రశంసిస్తున్నారు. కూతురు కోసం తన ప్రసంగాన్నే ఆపేయడాన్ని హర్షిస్తున్నారు.
 
41 ఏళ్ల జసిండా రెండో సారి న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రధానిగా ఉండగానే కూతురుకి ఆమె జన్మనిచ్చారు. పాకిస్థాన్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కూడా పీఎంగా ఉన్న సమయంలోనే తల్లి అయ్యారు.

More Telugu News