India: అందుకే పాక్, న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓట‌మి: రోహిత్ శ‌ర్మ

  • బయట ఉన్న ప్రతికూల పరిస్థితుల వ‌ల్ల‌ కొన్నిసార్లు రాణించలేక‌పోవ‌చ్చు
  • క్రికెట‌ర్లు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి
  • వ‌రుస‌గా అధిక మ్యాచ్‌లు ఆడటం వల్ల ప్ర‌తికూల ఫ‌లితాలు
  • పాక్, న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచుల్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్ట‌లేక‌పోయాం
  • అంత‌ మాత్రాన భార‌త్ బలహీనమైన జ‌ట్టు కాదు
rohit on india defeat

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో టీమిండియా తొలి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే. నిన్న‌ ఆఫ్ఘ‌నిస్థాన్ తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా 66 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీనిపై టీమిండియా బ్యాట్స్ మ‌న్ రోహిత్ శ‌ర్మ‌ స్పందిస్తూ... పాకిస్థాన్‌, న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచుల్లో చ‌విచూసిన‌ ఘోర  ఓటములకు కారణాలు తెలిపాడు.

బయట ఉన్న ప్రతికూల పరిస్థితుల వ‌ల్ల‌ కొన్నిసార్లు క్రికెట్‌లో రాణించడం కష్టమవుతుంద‌ని రోహిత్ శ‌ర్మ‌ చెప్పాడు.  మ్యాచ్ ఆడుతోన్న  ప్రతిసారీ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపాడు. అందుకు క్రికెట‌ర్లు మానసికంగా ప్రశాంతంగా ఉండాలని అన్నాడు. అయితే, వ‌రుస‌గా అధిక మ్యాచ్‌లు ఆడటం వల్ల కొన్నిసార్లు త‌మ నిర్ణయాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చని తెలిపాడు.

ఆటగాళ్లకు కొంత సమయం విరామం ఉండాలని రోహిత్ శ‌ర్మ‌ చెప్పాడు. ప్రపంచకప్‌లాంటివి ఆడేటప్పుడు ఆటగాళ్ల దృష్టి అంతా మ్యాచ్‌పైనే ఉండాలని తెలిపాడు. పాక్, న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచుల్లో తాము పూర్తి స్థాయిలో దృష్టి పెట్ట‌లేక‌పోయామ‌ని చెప్పాడు.

దీంతో ఆ రెండు మ్యాచుల్లోనూ ఓట‌మి చ‌విచూశామ‌ని రోహిత్ శ‌ర్మ‌ వివ‌రించాడు. రెండు మ్యాచుల్లో ఓడినంత మాత్రాన భార‌త్ బలహీనమైన జ‌ట్టు కాదని తెలిపాడు. పొర‌పాట్లు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకుని, మ‌ళ్లీ పుంజుకోవ‌డం ముఖ్య‌మ‌ని అన్నాడు. నిన్న‌టి మ్యాచ్‌లో తాము ఇలాగే ఆడి గెలిచామ‌ని తెలిపాడు.

More Telugu News