KCR: 27న హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్

  • హుజూరాబాద్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహ రచన
  • ఎన్నికల సంఘం విధించిన కరోనా ఆంక్షల సమక్షంలోనే కేసీఆర్ సభ
  • ఈ నెల 25న పార్టీ ప్లీనరీ.. 14 వేల మందికి ఆహ్వానం
KCR to Canvass in Huzurabad on 27th October

హుజూరాబాద్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్న టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచి పోటీ పడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయం కోసం వ్యూహ రచనలో మునిగిపోయిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27న ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్నట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల పరిధిలోనే కేసీఆర్ పర్యటన ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు, ఈ నెల 25న హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు టీఆర్ఎస్ భవన్‌లో ఆ పార్టీ శాసన, పార్లమెంటరీ పార్టీ సంయుక్తంగా భేటీ అయి కేంద్ర, రాష్ట రాజకీయాలు, టీఆర్ఎస్ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఈ నెల 25న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 14 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నట్టు సమాచారం.

More Telugu News