MAA: కొలువుదీరిన ‘మా’ కొత్త కార్యవర్గం.. హాజరు కాని చిరంజీవి, ప్రకాశ్​ రాజ్​

MAA New Team To Take Oath
  • అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు
  • ప్రమాణం చేసిన 15 మంది సభ్యులు 
  • హాజరైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ కొత్త కార్యవర్గం కొలువుదీరింది. కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. విష్ణు ప్యానెల్ లోని 15 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులూ వచ్చారు. అంతకుముందు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కల్చరల్ సెంటర్ లో కొత్త కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజలో మంచు విష్ణు, నరేశ్, శివబాలాజీ, ఆయన భార్య మధుమిత, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు దూరంగా ఉన్నారు. చిరంజీవి కూడా హాజరు కాలేదు. ఇటీవలి ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ కు చెందిన 15 మంది, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లోని 11 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులంతా రాజీనామా చేశారు. ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇవ్వాల్సిందిగా రెండు రోజుల క్రితం ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ రాశారు. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపైనే ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.

More Telugu News

MAA
Tollywood
Manchu Vishnu