Nalgonda District: నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వేధిస్తున్నారంటూ సర్పంచ్ రాజీనామా!

  • కలెక్టరేట్ ఏవోకు రాజీనామా లేఖ అందజేత
  • పార్టీలో చేరకపోవడం వల్లే ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపణ
  • బిల్లులు రాకుండా అడ్డుకున్నారన్న సర్పంచ్
  • ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే
Nalgonda dist yellamma gudem sarpanch Sandhya resigns

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వేధిస్తున్నారని ఆరోపిస్తూ అదే జిల్లా తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ గాదె సంధ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కలెక్టర్‌కు అందించేందుకు వెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ ఏవో మోతీలాల్‌కు అందించారు.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే వేధింపులు, ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేకే రాజీనామా చేసినట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన తాను ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌లో చేరకపోవడం వల్లే ఎమ్మెల్యే తనను వేధిస్తున్నారని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాదె సంధ్య ఆరోపణలపై ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్పందిస్తూ, గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం చేతకాక తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News