Ajay Mishra: కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదు

  • యూపీలో రైతుల పైనుంచి దూసుకుపోయిన కారు
  • ఘటనలో నలుగురు రైతుల మృతి
  • ఘటనా స్థలిలో తన కుమారుడు లేడని చెప్పిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
Murder case filed against union ministers son

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరి ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన రైతుల పైనుంచి కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో కారు దూసుకుపోయింది. ఈ ఘటన నేపథ్యంలో ఆశిష్ మిశ్రాపై స్థానిక పోలీసులు హత్య కేసును నమోదు చేశారు. ఆశిష్ తో పాటు పలువురి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
 
మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా స్పందిస్తూ... ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఘటనా స్థలిలో తన కుమారుడు లేడని అన్నారు. అక్కడ తన కొడుకు ఉంటే ప్రాణాలతో బయటపడేవాడు కాదని చెప్పారు. డిప్యూటీ సీఎం కార్యక్రమం జరుగుతున్న వేదిక వద్ద నా కొడుకు ఉన్నాడని.. తాను కూడా డిప్యూటీ సీఎం పక్కనే ఉన్నానని తెలిపారు. ఈ ఘటన జరిగిన జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు.

More Telugu News