IPL 2021: ఐపీఎల్‌ ప్రసార సమయంలో 10 సెకన్ల యాడ్ కోసం ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?

  • యాడ్ రేట్లను పెంచేసిన స్టార్ స్పోర్ట్స్
  • తొలి దశతో పోలిస్తే 20 నుంచి 30 శాతం పెంపుదల
  • పది సెకన్ల యాడ్ కోసం రూ. 18 లక్షలు వసూలు  
StarSports increases ad rates for IPL14 second phase

ప్రపంచ క్రికెట్లో అత్యంత ఎక్కువగా కాసులు కురిపించే టోర్నీల్లో ఐపీఎల్ ఒకటి. ఈ లీగ్ సమయంలో యాడ్స్ కోసం స్పాన్సర్లు క్యూ కడుతుంటారు. అయితే ఈ సారి ఐపీఎల్ రెండు భాగాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. తొలి భాగం భారత్‌లో జరగ్గా.. కరోనా మహమ్మారి కారణంగా రెండో భాగాన్ని యూఏఈలో నిర్వహిస్తున్నారు.

యూఏఈలో ఈ లీగ్ జరిగే సమయంలోనే దీపావళి, దసరా వంటి పండుగలు కూడా ఉన్నాయి. దీంతో పండుగల సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని లీగ్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నిర్ణయించుకున్నట్లు ఉంది. అందుకే తొలి సెషన్ ఐపీఎల్‌తో పోలిస్తే రెండో సెషన్‌లో యాడ్స్‌కు వసూలు చేసే మొత్తాన్ని భారీగా పెంచేసింది. ఐపీఎల్ మొదటి భాగంలో పది సెకన్ల యాడ్ కోసం రూ. 13 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకూ ఈ కంపెనీ వసూలు చేసింది.

ఐపీఎల్ రెండో భాగం సమయానికి ఈ రేటును 25 నుంచి 30 శాతం పెంచేసింది. పండుగల సీజన్ అనే కారణం చూపుతున్న స్టార్ సంస్థ.. ప్రస్తుతం ఐపీఎల్ మధ్యలో పది సెకన్ల యాడ్ కోసం రూ. 18 లక్షలపైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్‌లో కో-స్పాన్సర్లుగా డ్రీమ్ 11, ఫోన్‌పే, బైజూస్ ఉన్నాయి.

అసోసియేట్ స్పాన్సర్లుగా బింగో, కమలా పసంద్, ఏఎంఏఫ్ఐ, ఏషియన్ పెయింట్స్, క్యాడ్‌బరీ డైరీ మిల్క్, అమెజాన్ ప్రైమ్, థంబ్స్‌అప్, గార్నియర్ మెన్, క్రెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ లీగ్ కో-స్పాన్సర్‌షిప్ వ్యయం 110-125 కోట్ల రూపాయలుగా ఉంది. అసోసియేట్ స్పాన్సర్‌షిప్ ఖర్చు 65-70 కోట్ల రూపాయలని తెలుస్తోంది.

ఐపీఎల్ మొదటి దశలో కో-స్పాన్సర్లకు సంబంధించిన పది సెకన్ల యాడ్ కోసం బ్రాడ్‌కాస్టర్ రూ. 13.2 లక్షలు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి రూ.13.6 లక్షల వసూలు చేసినట్లు తెలుస్తోంది.

More Telugu News