Prime Minister: ప్రధాని మోదీకి నిద్రలేని రాత్రులను మిగుల్చుతాం.. ఖలిస్థానీ ఉగ్రసంస్థ ఎస్​ఎఫ్​ జే బెదిరింపులు

  • క్వాడ్ సదస్సుకు అమెరికా వెళ్లనున్న ప్రధాని
  • వైట్ హౌస్ ముందు ఆందోళనలు చేస్తామని ఎస్ఎఫ్ జే ప్రకటన
  • స్పందించిన ప్రధాని భద్రతా విభాగం
Khalistani Terror Outfit SFJ Warns Give Modi Sleepless Nights

ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికాలో నిద్రలేని రాత్రులు మిగుల్చుతామని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అనే ఖలిస్థానీ ఉగ్రసంస్థ బెదిరింపులకు దిగింది. క్వాడ్ నేతల సదస్సుకు ఈ నెల 24న ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదస్సు జరిగే రోజున శ్వేత సౌధం ముందు ఆందోళనలను నిర్వహిస్తామని ఎస్ఎఫ్ జే ప్రకటించింది. రైతులపై హింసకు వ్యతిరేకంగానే ఈ నిరసన అని తెలిపింది.

ఆ వ్యాఖ్యలపై ప్రధాని భద్రతా విభాగం స్పందించింది. కేవలం ప్రచారం కోసమే ఎస్ఎఫ్ జే వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసిందని పేర్కొంది. అందులో ఎక్కువ మంది పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ ఐ ఏజెంట్లే ఉన్నారని తెలిపింది. వారు నిరసన చేసే అవకాశాలున్నాయని వెల్లడించింది.

కాగా, గత కొన్నేళ్లుగా డార్క్ వెబ్ లో వెబ్ సైట్లను క్రియేట్ చేయడంతో పాటు అభ్యంతరకర సందేశాలను ఎస్ఎఫ్ జే పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే అందులో కొన్నింటిని తొలగించారు. రైతు ఉద్యమం సందర్భంగా వారిని ఆకర్షించే ప్రయత్నమూ చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే డబ్బు ఇవ్వడంతో పాటు విదేశీ పౌరసత్వం కూడా ఇప్పిస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో 2019 జులై 10న ఎస్ఎఫ్ జేపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

More Telugu News