Afghanistan: ఆఫ్ఘన్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం

  • పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  • జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా
  • తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సమయంలో భేటీ
PM modi meeting on Afghanistan crisis

తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్నాహాల్లో తాలిబన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఏ విషయాలపై చర్చ జరిగిందీ మాత్రం తెలియరాలేదు. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పౌరులపై ఆంక్షలు, విభేదించిన వారిపై కఠిన శిక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, ఇతర దేశాలతోపాటు భారత్‌తో కూడా తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఇది వరకు తాలిబన్లు ప్రకటించారు. ఆ తర్వాత దోహాలోని రాయబార కార్యాలయంలో భారత రాయబారి దీపత్ మిట్టల్‌తో సమావేశమయ్యారు కూడా. ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఈ భేటీలో తాలిబన్లకు భారత్ స్పష్టంగా చెప్పింది.

More Telugu News