ISIS: ఇరాక్ లో ఐసిస్ బీభత్సం... 13 మంది మృతి

  • ఓ పోలీసు చెక్ పోస్టుపై ఐసిస్ దాడి
  • అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన ముష్కరులు
  • మృతులందరూ పోలీసులే!
  • ఇటీవల పెరిగిన ఐసిస్ దాడులు
ISIS terrorists attacks on a Iraq police check point

ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఓ పోలీస్ చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అల్ రషాద్ ప్రాంతంలో కిర్కుక్ నగరానికి సమీపంలో గత అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగిందని ఇరాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి.

ఇరాక్ లోని పలు ప్రాంతాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఐఎస్ఐఎస్ తరచుగా సైన్యం, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఈ ఏడాది జులై 19న రాజధాని బాగ్దాద్ శివారు ప్రాంతంలో బాంబు దాడి జరిపి 30 మందిని పొట్టనబెట్టుకుంది.

ప్రస్తుతం ఇరాక్ లో సంకీర్ణ దళాల సంఖ్య 3,500 కాగా, వాటిలో 2,500 మంది అమెరికా సైనికులే. జో బైడెన్ అధికారంలోకి వచ్చాక మధ్య ప్రాచ్యం, ఆసియా వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ దళాలను పూర్తిగా వెనక్కి పిలిపించారు. ఇరాక్ లోనూ వచ్చే ఏడాది నుంచి స్థానిక సైన్యానికి శిక్షణ, సలహాలు ఇచ్చేందుకే తమ బలగాలను పరిమితం చేయాలని బైడెన్ నిర్ణయించారు.

More Telugu News