Vishnu Vardhan Reddy: హిందూ పండుగల మీద ఆంక్షలు విధించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు?: విష్ణువర్ధన్ రెడ్డి

  • ఏపీలో వినాయకచవితి వేడుకలపై ఆంక్షలు
  • ఇళ్లకే పరిమితం చేసుకోవాలన్న సర్కారు
  • మండిపడుతున్న బీజేపీ నేతలు
  • ఏకపక్ష నిర్ణయాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
Vishnuvardhan Reddy slams AP Govt on Vinayaka Chavithi

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీలో వినాయకచవితి వేడుకలను ఇళ్లకే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. హిందూ పండుగల మీద ఏకపక్షంగా కఠిన ఆంక్షలు విధించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని మండిపడ్డారు.

రంజాన్, బక్రీద్, మొహర్రం, క్రిస్మస్ వంటి పండుగలు ఎలా నిర్వహించాలో వారి మత పెద్దలతో చర్చించే మీరు.... 90 శాతం హిందువులు ఉండే సమాజంలో పండుగల విషయంలో మఠాధిపతులు, స్వామీజీలతో ఎందుకు చర్చించరు? అని నిలదీశారు. ఆ బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన కర్నూలులో సమావేశం నిర్వహించి చర్చిస్తామని, ఈ సాయంత్రం నిరవధిక నిరసన కార్యాచరణ ప్రకటిస్తామని విష్ణు వెల్లడించారు.

అటు, సోము వీర్రాజు స్పందిస్తూ, వినాయకచవితి పండుగ చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎవరిళ్లలో వారు పండుగ చేసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఇందులో ప్రత్యేకంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు. "ఆలయాల్లో వినాయకచవితి నిర్వహించకుండా, ఇళ్లలోనే చేసుకోండి అని ప్రభుత్వం చెప్పడం ఏంటి? ఈ మాటను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి" అని డిమాండ్ చేశారు.

More Telugu News