KTR: కేటీఆర్ ట్వీట్.. కౌనబనేగా క్రోర్‌పతిలో ప్రశ్న.. సమాధానం చెప్పిన సౌరవ్ గంగూలీ

  • అమితాబ్ కేబీసీ షోకు గంగూలీ, సెహ్వాగ్
  • ఈ ఏడాది మే 20న కేటీఆర్ ట్వీట్
  • దీనిని ఎవరికి ట్యాగ్ చేశారని అమితాబ్ ప్రశ్న
KTR tweet comes as question in amitabh bachchan kbc show

తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో చేసిన ఓ ట్వీట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ షోలో ప్రశ్నగా మారింది. బాలీవుడ్ బిగ్‌బీ ఓ టీవీ చానల్‌లో నిర్వహిస్తున్న ఈ షోకు టీమిండియా మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ హాజరయ్యారు. కేటీఆర్ గతంలో చేసిన ఓ ట్వీట్‌ను అమితాబ్ వీరికి ప్రశ్నగా సంధించారు. గంగూలీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం గమనార్హం. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కరోనా ఔషధాల పేర్లను ప్రస్తావిస్తూ ఈ ఏడాది మే 20న కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. పలికేందుకు కష్టంగా ఉన్న పేర్లను ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కేటీఆర్ ట్వీట్‌కు బదులిస్తూ తానైతే కరోనిల్, కరోజీరో, గో కరోనా గో వంటి పేర్లు పెడతానని పేర్కొన్నారు. తాజాగా, ఇదే ప్రశ్నను అమితాబ్ తన కేబీసీ షోలో అడిగారు. కేటీఆర్ తన ట్వీట్‌ను ఎవరికి ట్యాగ్ చేశారని ప్రశ్నించారు. సౌరవ్ గంగూలీ బాగా ఆలోచించిన అనంతరం శశిథరూర్ అని సరైన సమాధానం ఇచ్చారు. కేబీసీలో తన ట్వీట్‌ను ప్రశ్నగా అడగడంపై కేటీఆర్ తాజాగా స్పందించారు. సరదాగా చేసిన ట్వీట్ కేబీసీలో ప్రశ్నగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, ఈ షోలో గంగూలీ, సెహ్వాగ్ జంట రూ. 25 లక్షలు గెలుచుకున్నారు.

More Telugu News