TRS: బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

  • పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్
  • పావలాకు కూడా పనికిరాని యాత్ర అన్న యాదయ్య
  • కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందో చెప్పాలన్న ప్రకాశ్ గౌడ్
  • పాదయాత్ర వైపు ప్రజలు చూడడంలేదంటూ పట్నం విమర్శలు
TRS Legislators slams Bandi Sanjay

తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బండి సంజయ్ పాదయాత్ర పావలాకు కూడా పనికిరాని యాత్ర అని కాలె యాదయ్య పేర్కొన్నారు. ప్రజలు రాకపోవడంతో బస్సుల్లో తీసుకొచ్చి మరీ పాదయాత్ర సాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ చెబుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, సీఎం కేసీఆర్ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నారని అన్నారు. కేసీఆర్ వంటి నేత తెలంగాణలో మరొకరు లేరని, మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ దే అధికారం అని కాలె యాదయ్య ధీమా వ్యక్తం చేశారు.

కనీసం హైదరాబాద్ చరిత్ర ఏంటో కూడా తెలియని బండి సంజయ్ పేర్లు మార్చుతా అంటూ మాట్లాడుతున్నారని ప్రకాశ్ గౌడ్ మండిపడ్డారు. అసలు, బీజేపీ ప్రజలకు ఏంచేసిందో, రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందిస్తూ... బండి సంజయ్ చేపడుతున్నది పాదయాత్ర కాదని, బీజేపీ కార్యకర్తల ఊరేగింపు యాత్ర మాత్రమేనని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో బీజేపీ కార్యకర్తల హడావుడి తప్ప, ప్రజలు కన్నెత్తి చూడడంలేదని తెలిపారు. ప్రజలతో చర్చించేందుకు సమస్యలు లేకనే బండి సంజయ్ మతపరమైన అంశాలు తెరపైకి తెస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలసి ఉన్నారని, ఇది జీర్ణించుకోలేక బండి సంజయ్ మత విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News