Vizag Steel Plant: విశాఖ ఉక్కును అమ్మేస్తే మేలే జరుగుతుంది.. ఎంపీ రామ్మోహన్‌కు కేంద్రం లేఖ

  • గత నెల 3న స్టీల్‌ప్లాంట్ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన రామ్మోహన్ నాయుడు
  • వ్యూహాత్మకంగానే వాటాలు ఉపసంహరించుకుంటోందన్న మంత్రి
  • దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని వివరించిన ఆర్పీసింగ్
Union Minister RP Singh Wrote letter to MP Rammohan Naidu

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో మేలే జరుగుతుందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్‌కు లేఖ రాశారు. రామ్మోహన్ గత నెల 3న లోక్‌సభలో 377 నిబంధన కింద విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. స్పందనగా కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆర్పీసింగ్ నిన్న ఎంపీకి లేఖ రాశారు.

ప్రైవేటీకరణ వల్ల లాభమే జరుగుతుందని అన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్‌ లిమిటెడ్‌లో కేంద్రం తన వాటాను వ్యూహాత్మకంగానే ఉపసంహరించుకుంటోందని, దీని వల్ల మూలధనాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడానికి వీలవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. సంస్థ విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ఇది వీలవుతుందని  అన్నారు. ఫలితంగా ఉత్పాదకత పెరిగి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఎక్కువవుతాయని మంత్రి ఆ లేఖలో వివరించారు.

More Telugu News