Taliban: ఆఫ్ఘన్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన విధానాలకు రూపకల్పన చేయాలి: తాలిబన్లు

  • భారత్ కు స్నేహహస్తం చాచిన తాలిబన్లు
  • పాక్ మీడియాకు తాలిబన్ ప్రతినిధి ఇంటర్వ్యూ
  • ఎవరితోనూ శత్రుత్వం కోరుకోవడంలేదని వెల్లడి
  • భారత్-పాక్ చర్చలు జరపాలని సూచన
Taliban opines on ties with neighborhood cointries

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తాలిబన్లు, తాము ఎవరితోనూ శత్రుత్వం కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. భారత్ సహా అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆశిస్తున్నామని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో భారత్ ఎంతో కీలకమైన దేశమని, అయితే ఆఫ్ఘనిస్థాన్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత్ తన విధానాలకు రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ కు చెందిన ఏఆర్ వై న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ పై ప్రత్యేక అభిమానం చాటారు.

"పాకిస్థాన్ తో ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు పంచుకుంటోంది. మతం, సంప్రదాయాలు విషయానికొస్తే రెండు దేశాలు ఒకే వరుసలో నిలుస్తాయి. ఇరుదేశాల ప్రజలు ఇట్టే కలిసిపోతారు. అందుకే పాకిస్థాన్ తో మరింత బలమైన సంబంధాలను కోరుకుంటున్నాం" అని వివరించారు.

ముజాహిద్ మరికాస్త ముందుకెళ్లి భారత్-పాక్ విభేదాలపై స్పందించారు. అనేక అంశాల్లో పరస్పర ప్రయోజనాలు పొందుతున్న భారత్, పాకిస్థాన్ కొన్ని అంశాల్లోనే విభేదించడం ఎందుకని ప్రశ్నించారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.  

అంతేకాదు, కాబూల్ ఎయిర్ పోర్టు పేలుళ్ల ద్వారా ఐసిస్-కె వంటి ఉగ్రసంస్థలు ఉనికి చాటుకోవడంపై మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కూడా ముజాహిద్ బదులిచ్చారు. తమ భూభాగాన్ని మరో దేశానికి వ్యతిరేకంగా వాడుకునేందుకు అంగీకరించబోమని ముజాహిద్ ఉద్ఘాటించారు.

More Telugu News