Nakka Anand Babu: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తివేయించేందుకు జగన్ కుట్ర పన్నారు: నక్కా ఆనందబాబు ఆరోపణ

  • వైసీపీ నేతలు తాలిబన్ల మాదిరి పని చేస్తున్నారు
  • పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తున్నారు
  • అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతాం
Nakka Anand Babu fires on Jagan

వైసీపీ నేతలు తాలిబాన్ల మాదిరి పని చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. పోలీసుల చేత తప్పుడు పనులు చేయిస్తున్నారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయించలేదని చెప్పారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనే దాడులకు పాల్పడుతున్నారని... ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆనందబాబు దుయ్యబట్టారు. ఈ చట్టాన్ని ఎత్తివేయించేందుకు ముఖ్యమంత్రి జగన్ కుట్ర పన్నారని... అందుకే ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. హత్యకు గురైనవారి కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వచ్చిన సమయంలో వైసీపీ నేతలను కూడా పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.

అధికార పార్టీ నేతల వద్ద మార్కులు సంపాదించేందుకు పోలీసులు పిచ్చిపిచ్చి కేసులు పెడుతున్నారని ఆనందబాబు అన్నారు. జిల్లా పోలీసు అధికారులు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. అన్ని జిల్లాల్లో పేకాట, గుట్కా, మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి పోలీసు వచ్చి పేకాట శిబిరాలపై దాడులు చేయడం జిల్లా పోలీసు అధికారులకు సిగ్గు చేటని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని, ఈ పోలీసులను ఏ సజ్జల వచ్చి కాపాడతాడో చూస్తామని అన్నారు.

More Telugu News