Mekathoti Sucharitha: ఇంత వేగంగా దర్యాప్తు జరుగుతుంటే, దిశ చట్టం ఎక్కడుందని విపక్ష నేతలు ప్రశ్నించడం సబబేనా?: ఏపీ హోంమంత్రి సుచరిత

  • రమ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్
  • మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సుచరిత
  • దిశ చట్టంతో మహిళా భద్రత అంశంలో పెనుమార్పులొచ్చాయి  
  • 7 రోజుల్లో ఛార్జిషీటు నమోదు చేస్తున్నట్టు వెల్లడి
 Home minister Sucharitha explains Disha Act

గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడ్ని పోలీసులు త్వరితగతిన అరెస్ట్ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో దిశ చట్టం ఎక్కడుందని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారని, అసలు దిశ చట్టం వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయడంలోనూ, దర్యాప్తు విషయంలోనూ పోలీసులు ఎంతో వేగంగా పనిచేస్తున్నారని వివరించారు. దిశ చట్టంతో మహిళా భద్రత అంశంలో పెనుమార్పులు వచ్చిన అంశాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.

గతంలో ఏదైనా ఘటన జరిగితే దర్యాప్తుకు 3 నుంచి 4 నెలల సమయం పట్టేదని, 2019లో దర్యాప్తు సమయం 100 రోజులుగా ఉండగా, 2020లో అది 86 రోజులుగా ఉందని, 2021లో 42 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవుతోందని వివరించారు. దిశ చట్టం నేపథ్యంలో 1,645 కేసులకు సంబంధించి కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేయడం జరిగిందని, 1,531 సైబర్ బెదిరింపుల కేసుల్లోనూ... 2,017 లైంగిక వేధింపుల కేసుల్లోనూ వేగంగా ఛార్జిషీటు తెరవడం జరిగిందని వెల్లడించారు. దిశ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినప్పటికీ కేవలం 7 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

2,11,000 మంది లైంగిక నేరస్థుల డేటా బేస్ తమ వద్ద ఉందని, ఆ వివరాలను జియో ట్యాగింగ్ చేస్తున్నామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. మహిళలపై తీవ్ర దాడులకు పాల్పడ్డ 148 మంది నేరస్థులను దిశ ప్రకారం శిక్షించామని, వారిలో ముగ్గురికి ఉరిశిక్ష, 17 మందికి జీవితఖైదు, ముగ్గురికి 20 ఏళ్ల జైలుశిక్ష, 10 మందికి పదేళ్ల జైలు శిక్ష విధించారని తెలిపారు.

మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్ కూడా ఈ తరహా చట్టాన్ని ప్రవేశపెట్టేలా ఏపీ విధానాలను పరిశీలిస్తున్నారని వివరించారు. ఇంత జరుగుతుంటే ఏపీలో దిశ చట్టం ఎక్కడుందని విపక్ష నేతలు ప్రశ్నించడం సబబేనా అని హోంమంత్రి ప్రశ్నించారు. దిశకు సంబంధించి ఏపీకి 5 జాతీయస్థాయి అవార్డులు కూడా వచ్చాయని వెల్లడించారు.

చంద్రబాబు హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై ఓ ఎమ్మెల్యే చేయిచేసుకున్నాడని, ఓ మహిళకు నాడు ఏమాత్రం భద్రత ఉందో ఆ ఘటన చెబుతోందని సుచరిత విమర్శించారు. ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలైపోయిందని, ఆమెకు ఎలాంటి భద్రత కల్పించారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కానీ సీఎం జగన్ వచ్చాక మహిళల భద్రత మరింత మెరుగైందని పేర్కొన్నారు. దిశ చట్టంతో సత్వర న్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.

More Telugu News