Congress: కాంగ్రెస్​ పార్టీ అధికారిక ఖాతా సహా.. ఆ పార్టీకి చెందిన 5 వేల మంది నేతల ట్విట్టర్​ ఖాతాలు బ్లాక్​!

  • మోదీ జీ.. ఎందుకంత భయమంటూ కాంగ్రెస్ ప్రశ్న
  • సత్యం, అహింసతోనే స్వాతంత్ర్యం తెచ్చామని కామెంట్
  • అప్పట్లాగే ఇప్పుడూ గెలుస్తామని వెల్లడి
  • ట్విట్టర్ ను మోదీ ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపణ
Congress Says 5000 leaders accounts been locked

కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్ తో పాటు.. 5 వేల మంది పార్టీ కార్యకర్తలు, నేతల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీలో గత వారం తొమ్మిదేళ్ల దళిత బాలికను అత్యాచారం చేసి హత్యచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాధితురాలి కుటుంబాన్ని తన కారులో కూర్చోబెట్టుకుని రాహుల్ గాంధీ ఓదార్చారు. వారి వివరాలు వెల్లడయ్యేలా వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ట్విట్టర్ ఆయన ఖాతాను తాత్కాలికంగా లాక్ చేసింది.

దీనిపై కాంగ్రెస్ మండిపడింది. కేవలం ఎంపిక చేసుకున్న వారి ఖాతాలనే ఎందుకు బ్లాక్ చేస్తున్నారని ప్రశ్నించింది. తాజాగా కాంగ్రెస్ ఖాతానూ ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎదుటి వ్యక్తుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేసినందుకుగానూ ఖాతాను బ్లాక్ చేస్తున్నట్టు పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘‘మోదీ గారూ.. మీకు ఎందుకంత భయం? దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాడింది. సత్యం, అహింస, ప్రజల ఆశీస్సులనే ఆయుధాలుగా మలిచి గెలిచాం. ఇప్పుడూ గెలుస్తాం’’ అని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.

కాగా, సుర్జేవాలా, అజయ్ మాకెన్, సుస్మితా దేవ్, జితేందర్ సల్వార్, మాణిక్కం ఠాగూర్ వంటి కీలక నేతల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసినట్టు కాంగ్రెస్ వెల్లడించింది. ట్విట్టర్ ను బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించింది. కాగా, వెంటనే రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేశారు.

ఈ నెల 2న ఎస్సీ కమిషన్ బాధితుల ఫొటోను పోస్ట్ చేసినా ట్విట్టర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్ష నేతలపైనే చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగించే విషయమని, పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ఖాతాలను ఆటోమేటిక్ గా బ్లాక్ చేయడం చాలా తీవ్రమైన చర్య అని, ఆ విధానాలను మార్చాలని ట్విట్టర్ కు సూచించారు.

More Telugu News