EAMCET: ఎల్లుండి నుంచి తెలంగాణ ఎంసెట్... సర్వం సిద్ధం

  • ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్
  • తెలంగాణలో 82, ఏపీలో 23 పరీక్ష కేంద్రాలు
  • ఒక్క నిమిషం నిబంధన అమలు
  • మూడు భాషల్లో ప్రశ్నాపత్రాలు
  • కొవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరి
All set for Telangana EAMCET

తెలంగాణలో ఎంసెట్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆగస్టు 4 నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరుగుతుందని, మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు కొవిడ్ మార్గదర్శకాలపై సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులు కరోనా మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని గోవర్ధన్ పేర్కొన్నారు.

కాగా, ఎంసెట్ పరీక్షల కోసం తెలంగాణ 82 పరీక్ష కేంద్రాలు, ఏపీలో 23 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థి పరీక్ష రాసే లొకేషన్ ను కూడా హాల్ టికెట్ పై ముద్రించినట్టు వివరించారు.

తెలంగాణ ఎంసెట్ పరీక్షల్లో భాగంగా 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగంలోనూ.... 9, 10వ తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలోనూ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో జరిగే ఈ పరీక్షల కోసం తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు మాధ్యమాల్లో ప్రశ్నాపత్రాలను రూపొందించారు. విద్యార్థులు తమ సౌలభ్యం మేరకు భాషను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.

More Telugu News