KCR: ఏపీది దాదాగిరి.. కేంద్రానిది వ్యతిరేక వైఖరి: కేసీఆర్

  • కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి చేస్తోంది
  • కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఎలా కడుతోందో అందరూ చూస్తున్నారు
  • తెలంగాణపై కేంద్రం వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తోంది
KCR fires on AP on Krishna river water

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరీ చేస్తోందని దుయ్యబట్టారు. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు ఎలా కడుతోందో అందరూ చూస్తున్నారని అన్నారు. కృష్ణానది నీటికి సంబంధించి రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇబ్బంది జరిగే అవకాశం ఉందని చెప్పారు.

అందువల్ల మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని... పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను తెచ్చుకుందామని అన్నారు. ఈ అనుసంధానానికి సంబంధించిన పనుల కోసం సర్వే జరుగుతోందని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ సెటైర్లు వేశారు. 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని తాము చెపితే గతంలో జానారెడ్డి ఎగతాళి చేశారని అన్నారు. అదే జరిగితే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని అన్నారని... తాము 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. కానీ జానారెడ్డి మాత్రం మొన్నటి ఉపఎన్నికలో కాంగ్రెస్ కండువానే కప్పుకుని పోటీ చేశారని చెప్పారు.

More Telugu News