JC Prabhakar Reddy: నీలకంఠాపురంలో రఘువీరారెడ్డిని కలిసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి

  • నీలకంఠాపురం వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి
  • రఘువీరాతో ఆత్మీయ భేటీ
  • రాయలసీమ నీటి అంశాలపై చర్చ
  • మద్దతు ఇవ్వాలని రఘువీరాకు విజ్ఞప్తి
JC Prabhakar Reddy met Raghuveera Reddy

కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సీనియర్ రాజకీయవేత్త రఘువీరారెడ్డి ప్రస్తుతం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బిజీ అయ్యారు. తన సొంతూరు అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో భారీ ఎత్తున ఆలయ పునర్ నిర్మాణం చేపట్టిన రఘువీరా ఎక్కువ సమయం అక్కడే గడుపుడుతున్నారు. కాగా, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ రఘువీరారెడ్డిని కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

నీలకంఠాపురం విచ్చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి... రఘువీరాతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. రఘువీరా కుటుంబీకులు నిర్మించిన ఆలయాలను సందర్శించారు. రఘువీరా వెంట ఉండి జేసీకి ఆలయాలను చూపించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పూజలు కూడా చేశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ, సీమ నీటి సమస్యలపై రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే రఘువీరాను కలిసినట్టు తెలిపారు.

ఒకప్పుడు జేసీ సోదరులు, రఘువీరా కాంగ్రెస్ లోనే ఉండేవారు. కాలక్రమంలో జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరగా, రఘువీరా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం పీసీసీ బాధ్యతలు చేపట్టినా, క్రమంగా పార్టీకి దూరమయ్యారు.

More Telugu News