YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు.. మరో ఆరుగురిని విచారించిన సీబీఐ

  • ముమ్మరంగా సాగుతున్న వివేకా హత్య కేసు విచారణ
  • రంగన్న చెప్పిన వారిని మరోమారు విచారిస్తున్న సీబీఐ
  • పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టు నుంచి పత్రాల సేకరణ
YS Viveka murder case cbi questioned 6 suspects

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇటీవల అనుమానితులను వరుసగా విచారిస్తూ వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో బసచేసిన సీబీఐ అధికారులు నిన్న మరో ఆరుగురిని విచారించారు. జిల్లాలోని వేముల యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి, అనంతపురం జిల్లా కదిరికి చెందిన లోకేశ్, గోవర్థన్, రాజుతోపాటు మరో ఇద్దరిని విచారించి కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది.  

మరోవైపు, వివేకా  ఇంటి వాచ్‌మన్ రంగన్న తన వాంగ్మూలంలో పేర్కొన్న వారిని సీబీఐ అధికారులు మరోమారు విచారిస్తున్నారు. సీబీఐ అధికారులు నిన్నసాయంత్రం పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టు నుంచి కొన్ని ఫైల్స్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News