Team India: చివరి టీ20లో తడబడిన భారత్.. శ్రీలంకదే సిరీస్

  • లంక బౌలర్లకు భారత బ్యాట్స్‌మెన్ దాసోహం
  • మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-1తో శ్రీలంక కైవసం
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ రెండూ హసరంగకే
Sri Lanka Won 3rd t20 against India

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి జరిగిన చివరి మ్యాచ్‌లో బ్యాటింగులో దారుణంగా విఫలమైన భారత జట్టు సిరీస్‌ను లంకకు సమర్పించుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన ధావన్ సేన.. లంక బౌలర్లకు దాసోహమైంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఫలితంగా టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో అవిష్క ఫెర్నాండో 12, మినోద్ భానుక 18, ధనంజయ డి సిల్వ 23 పరుగులు (నాటౌట్) చేయగా, బౌలింగులో చెలరేగి నాలుగు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కూల్చిన వనిందు హసరంగ 14 పరుగులు చేశాడు. ఫలితంగా 14.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. భారత్‌పై శ్రీలంకకు ఇది తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం గమనార్హం. శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన హసరంగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’,‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. కాగా, శ్రీలంక కోల్పోయిన మూడు వికెట్లు రాహుల్ చాహర్‌కే దక్కాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 5 పరుగుల వద్ద ఓపెనర్ ధావన్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 23, 24, 25 పరుగుల వద్ద ఒక్కో పరుగు తేడాతో మూడు వికెట్లు నేలకూలాయి. శ్రీలంక బౌలర్లు, ముఖ్యంగా హసరంగ బౌలింగ్ ముందు నిలవలేక భారత కుర్రాళ్లు చేతులెత్తేశారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు.

చివర్లో భువనేశ్వర్ కుమార్ (16), కుల్దీప్ యాదవ్ (23) బౌలర్లను ఎదురొడ్డి కాసేపు క్రీజులో నిలదొక్కుకోవడంతో టీమిండియా ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు కలిసి చేసిన పరుగులు 25 మాత్రమే. ఇందులో మూడు డకౌట్‌లు ఉన్నాయి. లంక బౌలర్లలో హసరంగ నాలుగు వికెట్లు తీసుకోగా, శనక రెండు, చమీర, ఆర్.మెండీస్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 2-1తో కైవసం చేసుకుంది.

More Telugu News