NDA: రాజకీయ లబ్ధి కోసమే లక్ష్మీనారాయ‌ణ పిటిష‌న్ వేశారు.. 'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ'పై కేంద్రం కౌంట‌ర్ అఫిడ‌విట్!

  • విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం కౌంటర్ దాఖలు 
  • గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి ల‌క్ష్మీ నారాయ‌ణ పోటీచేశారన్న కేంద్రం
  •  నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే పెట్టుబ‌డు‌ల ఉప‌సంహ‌ర‌ణ చేస్తున్నామ‌ని వివ‌ర‌ణ
  • పిటిష‌న్ కు విచారణ అర్హత లేదన్న కేంద్రం 
centre files counter in high court

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లుకు వారం రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని ఇటీవ‌లే న్యాయ‌స్థానాన్ని కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు.

దీంతో ఆగ‌స్టు 2 లోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో ఈ రోజు కేంద్ర స‌ర్కారు కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉప సంహరణ జరుగుతోందని వివ‌రించింది.

ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ స‌రికాద‌ని చెప్పింది. ఇప్ప‌టికే ఇటువంటి పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ప‌లు తీర్పులు ఉన్నాయని తెలిపింది.

ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ల‌క్ష్మీ నారాయ‌ణ జ‌న‌సేన త‌ర‌ఫున విశాఖ నుంచి పోటీ చేసిన అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తావించింది. వ్యాజ్యం దాఖలు చేసిన లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ వేశారని కౌంటర్‌లో బీజేపీ ఆరోపించింది. ఆయ‌న పిటిష‌న్ కు విచారణ అర్హత లేదని అభిప్రాయ‌ప‌డింది.

More Telugu News