Godavari: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం... రెండో ప్రమాద హెచ్చరిక జారీ

  • ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరిన గోదావరి 
  • నీట మునిగిన అన్నదానసత్రం, దుకాణాలు
  • అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్
Godavari river water level raised at Bhadrachalam

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరి నది భీకరంగా ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తాజాగా ఇక్కడ గోదావరి నీటి మట్టం 48.30 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పందిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సాయం అవసరమైన వారు 08744-241950, 08743-232444 నెంబర్లకు కాల్ చేయాలని, తమ పరిస్థితిని వివరిస్తూ ఫొటోలు పంపేవారు 93929 19743 నెంబరుకు వాట్సాప్ చేయాలని సూచించారు.

కాగా, పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం క్షేత్రంలోని పడమర మెట్లకు వద్ద వరద నీరు చేరింది. అన్నదాన సత్రం, పడమర మెట్ల వద్ద ఉన్న దుకాణాలు నీట మునిగాయి.

More Telugu News