Sharmila: తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో పాల్గొన‌క‌పోతే తెలంగాణపై ప్రేమ లేన‌ట్లేనా?: మీడియా స‌మావేశంలో ష‌ర్మిల‌

  • మ‌హిళ‌లంటే  చుల‌క‌న ఎందుకు?  
  • నిరుద్యోగుల కోసం నేను వ్ర‌త‌మే చేస్తున్నాను
  • ఎన్టీఆర్ గారికి టీడీపీ వెన్నుపోటు  
  • వైఎస్సార్ గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది 
sharmila slams kcr

మ‌హిళ‌లంటే టీఆర్ఎస్ అగ్ర‌నేత‌ల‌కు ఎందుకు చుల‌క‌న అని వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఈ రోజు హైద‌రాబాద‌డ్‌లో ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... మ‌హిళ‌లంటే వ్ర‌తాలే చేసుకుంటూ కూర్చోవాల‌ని కేటీఆర్ అంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిరుద్యోగుల కోసం తాను వ్ర‌త‌మే చేస్తున్నానని వ్యాఖ్యానించారు.

రాజ‌న్న రాజ్యం రాక‌పోతే ప్ర‌జ‌లే తిర‌గ‌బ‌డ‌తారని ఆమె హెచ్చ‌రించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో పాల్గొన‌క‌పోతే తెలంగాణపై ప్రేమ లేన‌ట్లేనా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ‌కు వ్య‌తిరేక‌మ‌ని తాను ఎన్న‌డూ చెప్ప‌లేదని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ నియంత అని, ఆయ‌న‌ను ఎవరూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని అనుకుంటారని చెప్పారు. కేసీఆర్ మ‌హిళ‌ల‌కు విలువ ఇవ్వ‌రని ఆమె ఆరోపించారు.


వైఎస్సార్ గారిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది

కాంగ్రెస్ పార్టీపై ష‌ర్మిల మండిప‌డ్డారు. 'ఎన్టీఆర్ గారిని టీడీపీ వెన్నుపోటు పొడిచిన‌ట్లే.. వైఎస్సార్ గారిని కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. వైఎస్సార్ గారు చ‌నిపోయాక ఆయ‌న పేరును ఓ కేసులో ఎఫ్ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీ నేత‌లు తాము వైఎస్సార్ వార‌సులమ‌ని చెప్పుకుంటున్నారు. వీళ్లా వార‌సులు? సిగ్గుండాలి ఇలా చెప్పుకోవడానికి' అని ష‌ర్మిల విమ‌ర్శించారు.


'కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందికి రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చింది రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు. వైఎస్ తెలంగాణ వ్య‌తిరేకి కాదు. నేడు వైఎస్సార్ ఆశ‌యాల‌కు అనుగుణంగా అభివృద్ధి జ‌రిగే ప‌రిస్థితులు లేవు. రాజ‌న్న రాజ్యాన్ని తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టాను. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను వైఎస్సార్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు' అని ష‌ర్మిల చెప్పారు.

జ‌గ‌న్‌పై అలిగి పార్టీ పెట్టాన‌ని అన‌డం స‌రికాదు
తాను ఏపీ ముఖ్య‌మంత్రి, త‌న అన్న‌ జ‌గ‌న్‌పై అలిగి పార్టీ పెట్టాన‌ని అన‌డం స‌రికాదని ష‌ర్మిల అన్నారు. 'ఒకవేళ నిజంగా అలిగితే మాట్లాడ‌డం మానేస్తారు కానీ, ఇలా పార్టీలు పెడ‌తారా? ఇక్క‌డ పార్టీ పెట్ట‌డానికి కార‌ణం ప్ర‌జ‌ల బాగు కోస‌మే. ఏడేళ్లుగా కేసీఆర్ పాల‌న‌లో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. కోట్లాది రూపాయ‌లు అప్పులు తెచ్చారు. ఆ డ‌బ్బుల‌న్నీ ఏమి చేశారు? ఉద్యోగాలు ఇచ్చారా?  రైతుల‌కు సాయం చేశారా?' అని ష‌ర్మిల విమ‌ర్శించారు.


'కేసీఆర్ బాత్రూంలు కూడా బుల్లెట్ ఫ్రూఫ్ తో క‌ట్టుకున్నారు. ఆయ‌న ప్రాణాల‌కు ఉన్న విలువ యువ‌త ప్రాణాల‌కు లేదా? నాకేదో ఏపీలో ప‌ద‌వి రాలేద‌నో, నేను అసంతృప్తిలో ఉన్నాన‌నో ఇక్క‌డ పార్టీ పెట్ట‌లేదు. తెలంగాణ ప్ర‌జ‌ల బాగు కోసమే, రాజ‌న్న రాజ్యాన్ని తీసుకురావ‌డం కోస‌మే పార్టీ పెట్టాను' అని ష‌ర్మిల చెప్పారు.

More Telugu News