Vijayasai Reddy: విశాఖ స్టీల్ ప్లాంటు అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం: విజయసాయిరెడ్డి

Will raise Vizag steel plant issue in Parliament says Vijayasai Reddy
  • ప్లాంటును ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
  • ప్లాంటు కార్మికుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తాం
  • స్టీల్ ప్లాంటును ప్రైవేట్ పరం చేయడానికి వైసీపీ వ్యతిరేకం
ఈ పార్లమెంటు సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంటు అంశాన్ని లేవనెత్తుతామని... ప్లాంటును ప్రైవేటు పరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. వచ్చే నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టబోయే నిరసనలకు తాము మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఈరోజు విజయసాయి, మంత్రి అవంతి శ్రీనివాస్ లతో స్టీల్ ప్లాంట్ కార్మికులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
విపక్ష నేతల మద్దతును కూడా కూడగట్టి పార్లమెంటులో తమ గళాన్ని వినిపిస్తామని విజయసాయి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రవేటు పరం చేయడానికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని... అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం సరికాదని చెప్పారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వైజాగ్ ప్లాంటుకు ఉన్న రుణాలను ఈక్విటీగా మార్చాలని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు గనులను కేటాయిస్తే, ఖర్చులు బాగా తగ్గుతాయని అన్నారు.
Vijayasai Reddy
YSRCP
Vizag Steel Plant
Parliament

More Telugu News