Vijayashanti: గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారు: కేసీఆర్‌పై విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు

vijayshanti slams kcr
  • చట్టాలను కాపాడవలసిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు
  • రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది
  • చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్నవారిపైన  దాడులు
  • హిందూ సమాజపు ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు

తెలంగాణ  సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. గోవ‌ధ చ‌ట్టాన్ని ప‌క్కాగా అమ‌లు చేయాల‌ని ఆమె సూచించారు. 'హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు గోముఖ వ్యాఘ్రంలా ప్రవర్తిస్తున్నారు. నికార్సైన హిందువునని చెప్పుకుంటూ హైందవ ధర్మానికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు' అని విజ‌య‌శాంతి ఆరోపించారు.

'చట్టాలను కాపాడవలసిన రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి... గోవధ నిషేధ చట్టానికి శఠగోపం పెడుతున్నారు. లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా మీ సయామీ ట్విన్ పార్టీ ఎంఐఎం నేతలు చట్ట విరుద్ధంగా బక్రీద్ రోజున గోవధ చేస్తామంటూ డీజీపీకి వినతి పత్రం ఇస్తే మీరు చూస్తూ ఊరుకున్నారు తప్ప చేస్తున్నదేమీ లేదు. అసలు ఇలాంటి వినతి పత్రం ఇచ్చినందుకు ఆ పార్టీ నేతలను రాజ్యాంగబద్ధమైన పదవుల నుంచి తప్పించాలి' అన్నారామె.

'అక్రమంగా గోవుల రవాణాను నిరోధించి, గోవధ జరగకుండా అడ్డుకుని రక్షించడానికి రాజ్యాంగంలోని జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో పలు తీర్పులు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులను అనుసరించడం మాట అటుంచితే, రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. చట్టాలకు అనుగుణంగా గోవులను రక్షిస్తున్నవారిపైన తెలంగాణలో దాడులు జరుగుతున్నాయి' అని విజ‌య‌శాంతి అన్నారు.

'ఈ పరిణామాలపై తగిన చర్యలు తీసుకుని గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా సర్కారుదే. కాదంటే, హిందూ సమాజపు ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు' అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News