KCR: కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లు రూ.10 వేల కోట్లు వచ్చినా రైతుల కోసం భరిస్తాం: సీఎం కేసీఆర్

  • సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటన
  • కాళేశ్వరంపై అనునామాలు వ్యక్తం చేశారని వెల్లడి
  • ఇప్పుడు కాళేశ్వరం అద్భుతంగా కనిపిస్తోందని వివరణ
  • ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం
CM KCR responds on Kaleswaram project electricity bills

సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారని, కానీ అదే కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కనిపిస్తోందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల బిల్లు వచ్చినా భరిస్తామని స్పష్టం చేశారు.

ఇతర అంశాల గురించి మాట్లాడుతూ, 9 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్ సీఐకి అందించామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతు బీమా మాదిరిగా చేనేత కార్మికులకు రూ.5 లక్షల చొప్పున బీమా అందిస్తున్నట్టు వివరించారు. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకువస్తామని చెప్పారు. రూ.10 వేల కోట్లతో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. త్వరలో 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛను మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

More Telugu News