Rajamouli: ఇదేమీ బాగోలేదండీ.. ఢిల్లీ విమానాశ్రయంలో ఎదురైన అనుభవంపై రాజమౌళి ట్వీట్!

Rajamouli Tweet on Indian Airports
షార్ట్స్‌లో చూడండి
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయన, అక్కడ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. తొలిసారిగా ఇండియాకు వచ్చే వారికి ఇది మంచి అభిప్రాయాన్ని కల్పించేలా లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాలకు సూచించారు. ఇంతకీ రాజమౌళికి ఎదురైన పరిస్థితి ఏంటో ఆయన మాటల్లోనే చూస్తే...

"అర్థరాత్రి ఒంటి గంటకు లుఫ్తాన్తా విమానంలో దిగాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తులను ఇచ్చారు. అందరు ప్యాసింజర్లూ దరఖాస్తులను గోడకు ఆనించి, మరికొందరు కింద కూర్చుని వాటిని పూర్తి చేస్తున్నారు. ఇదేమీ నాకు బాగా అనిపించలేదు. దరఖాస్తులను పూరించేందుకు టేబుల్స్ ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇక్కడ నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఏమిటంటే, బయటకు రాగానే ఎన్నో వీధి కుక్కలు కనిపించాయి. ఇది తొలిసారిగా భారత్ కు వచ్చే విదేశీయులకు మన దేశంపై మంచి అభిప్రాయాన్ని కలిగించబోదు. ఈ విషయాన్ని అధికారులు దయచేసి పరిశీలించాలి. కృతజ్ఞతలు..." అని రాజమౌళి ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ చూసిన వారు కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలని, మీ నుంచి ట్వీట్ వచ్చింది కాబట్టి పరిస్థితి మారుతుందని, తాము కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నామని అంటున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారా?అని కూడా కొందరు ప్రశ్నించారు.
Go Back to Shorts
Rajamouli
India
Airport

More Telugu News