China: అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

  • నేడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవ కార్యక్రమం
  • తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దన్న జిన్ పింగ్
  • గ్రేట్ వాల్ ను ఢీకొట్టాలనుకునే వారి తల పగులుతుందని హెచ్చరిక
Jinping warns US

చైనాను బెదిరించడం, లొంగదీసుకోవడం, అణచివేయడం వంటి ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. తియానన్మెన్ స్వేర్ లో జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... పరోక్షంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్ సమస్య పరిష్కారానికి, చెనా ప్రయోజనాలను కాపాడుకోవడానికి, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తమ ప్రజలకు ఉన్న సంకల్పాన్ని, సామర్థ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు.

ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను ఢీకొనాలనుకునే వారి తల పగులుతుందని జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. దుస్సాహసం చేసే ప్రయత్నం ఎవరూ చేయవద్దని హెచ్చరించారు. మకావ్, హాంకాంగ్ లలో పూర్తి స్థాయిలో స్వయం ప్రతిపత్తి కొనసాగుతోందని... ఒక దేశం, రెండు వ్యవస్థల విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

చైనా అభివృద్ధిలో కమ్యూనిస్టు పార్టీది కీలక పాత్ర అని ఆయన అన్నారు. చైనా ప్రజలను పార్టీకి దూరం చేయాలని భావించిన వారందరూ ఓడిపోయారని చెప్పారు. దాదాపు గంట సేపు జిన్ పింగ్ ప్రసంగం కొనసాగింది. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన 70 వేల మందిలో ఏ ఒక్కరూ మాస్క్ ధరించకపోవడం విశేషం! 

More Telugu News