Haryana: హద్దులు దాటడం మంచిది కాదు.. రైతులకు హర్యానా సీఎం హెచ్చరిక

  • సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
  • ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు
  • స్థానిక బీజేపీ నాయకులు, రైతుల మధ్య ఘర్షణ
  • నేతలు సంయమనం పాటిస్తున్నారన్న ఖట్టర్‌
  • నేతల పర్యటనను అడ్డుకోవడంపై ఆగ్రహం
Crossing limits is not good for anyone

కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ-యూపీ సరిహద్దు ఘాజీపూర్‌లో దీక్ష చేస్తున్న రైతన్నల పట్ల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు రైతుల నిరసనల పట్ల సంయమనం పాటిస్తున్నారన్నారు. అయితే, ఎవరైనా హద్దు దాటడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఘాజీపూర్‌లో రైతులు, స్థానిక బీజేపీ కార్యకర్తలకు మధ్య ఈరోజు ఉదయం స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతు అనే పదం చాలా స్వచ్ఛమైందని.. ప్రతిఒక్కరూ అన్నదాతల్ని గౌరవిస్తారని ఖట్టర్‌ అన్నారు. కానీ, కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల రైతు అనే పదానికి ఉన్న గౌరవం పోతోందన్నారు. నిరసనల ముసుగులో మహిళల గౌరవం మసకబారుతోందన్నారు. హత్యలు జరుగుతున్నాయన్నారు. రోడ్లను నిర్బంధిస్తున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనలను ఖండిస్తున్నానన్నారు.

గ్రామాల్లో పర్యటనకు వస్తున్న బీజేపీ నాయకులను రైతులు అడ్డుకోవడంపై ఖట్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారికి ప్రజలను కలవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ముఖ్యమంత్రిని కూడా గ్రామాల్లో పర్యటించేందుకు అనుమతించబోమని అనడం ఏమాత్రం సరి కాదన్నారు.

More Telugu News