Chandrababu: దమ్ముంటే వారి పేర్లు బయటపెట్టండి.. జగన్‌కు చంద్రబాబు సవాల్

Chandrababu naidu dares to Jagana on Covid deaths
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కొవిడ్ బాధితుల డిమాండ్ల సాధన దీక్ష’ పేరిట నిన్న రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన దీక్షలో పాల్గొన్న చంద్రబాబు దీక్ష ముగింపు అనంతరం మాట్లాడారు.

కొవిడ్ బారినపడి రాష్ట్రంలో 12,500 మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని, దమ్ముంటే వారి పేర్లు వెల్లడించాలని సవాలు విసిరారు. ఏపీలో మే నెలలో సగటును ప్రతి ఏడాది 27 వేల మంది చనిపోతున్నట్టు నాలుగైదేళ్ల గణాంకాలు చెబుతున్నాయని, ఈ ఏడాది 1.27 లక్షల మరణాలు నమోదైనట్టు అహ్మదాబాద్ ప్రొఫెసర్ చెప్పారని అన్నారు.

దీనిని బట్టి చూస్తే మిగతా లక్షమంది ఎలా చనిపోయారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవాగ్జిన్‌కు కులం బురద పూయడం ఏంటంటూ చంద్రబాబు మండిపడ్డారు. వ్యాక్సిన్లు భారీగా వేశామని ప్రచారం చేసుకోవడం కాదని, నిజంగా ఒక్క టీకాను అయినా కొనుగోలు చేశారా? అని ప్రశ్నించారు. టీకాలపై ప్రశ్నిస్తే అది మీ బంధువులదంటూ తనపైకి నెపం నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డి బంధువులు, సహ నిందితుల కంపెనీలు కూడా వ్యాక్సిన్లు తయారు చేశాయి కదా.. మరి వారెందుకు ఇవ్వలేదని నిలదీశారు. రెమ్‌డెసివిర్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ జగన్ సహ నిందితుడిదేనని అన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయకుండా ఉండి ఉంటే కరోనా కారణంగా చనిపోయిన లక్ష కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున సాయం అంది ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
COVAXIN
Corona Virus

More Telugu News