EU: కొవిషీల్డ్ కు అనుమతి కోరుతూ మాకెలాంటి దరఖాస్తు అందలేదు: ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ

  • కొవిషీల్డ్ తీసుకున్నవారికి నో చెబుతున్న యూరప్
  • గ్రీన్ పాస్ జాబితా నుంచి కొవిషీల్డ్ తొలగింపు
  • జాబితాలోని వ్యాక్సిన్లు తీసుకున్న వారికే అనుమతి
  • నిన్న స్పందించిన సీరం అధిపతి
  • దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్న ఈయూ
EU says they have received no approval request for covishield

భారత్ లో తయారైన కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి యూరప్ దేశాల్లో ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, భారతీయుల్లో ఆందోళన హెచ్చుతోంది. యూరోపియన్ యూనియన్ గ్రీన్ పాస్ పేరిట ఓ జాబితా అమలు చేస్తోంది. ఆ జాబితాలో ఉన్న వ్యాక్సిన్లు తీసుకున్నవారికి తమ దేశాల్లో అనుమతి ఇస్తోంది. ఇటీవలే ఈ జాబితా నుంచి కొవిషీల్డ్ ను తొలగించారు. దీనిపై కొవిషీల్డ్ ఉత్పత్తిదారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా స్పందిస్తూ, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో, ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ స్పందించింది. కొవిషీల్డ్ కు అనుమతి కోరుతూ తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదని స్పష్టం చేసింది. పలు దేశాల నుంచి ఏమంత ప్రాముఖ్యత లేని ప్రయాణాలను తాము అనుమతించడంలేదని, అందులో భారత్ కూడా ఉందని వెల్లడించింది. నిన్నటివరకు కొవిషీల్డ్ కు అనుమతి ఇవ్వాలంటూ తమకు ఎలాంటి విజ్ఞాపన రాలేదని, ఒకవేళ వస్తే తమ విధివిధానాల మేరకు పరిశీలిస్తామని ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ హామీ ఇచ్చింది.

More Telugu News