Kathi Mahesh: కత్తి మహేశ్ కు శస్త్రచికిత్సలు విజయవంతం!

  • కోలుకుంటున్న కత్తి మహేశ్
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న చెన్నై వైద్యులు
  • ఇటీవల నెల్లూరు జిల్లాలో రోడ్డుప్రమాదం
  • తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన మహేశ్
Kathi Mahesh on recovery way

ప్రముఖ సినీ సమీక్షకుడు, నటుడు కత్తి మహేశ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహేశ్ కు నిన్న నిర్వహించిన శస్త్రచికిత్సలు విజయవంతం అయ్యాయి. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మహేశ్ ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తుండగా నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమకన్ను, తల భాగానికి బలమైన గాయాలు అయ్యాయి.

మొదట నెల్లూరు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించారు. అప్పటినుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత ముక్కుకు సర్జరీ చేసిన వైద్యులు, ఆపై శంకర్ నేత్రాలయ వైద్యుల సమన్వయంతో కంటికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపై నుదుటికి తగిలిన గాయానికి తేలికపాటి ఆపరేషన్ చేపట్టారు.

కత్తి మహేశ్ కు ప్రాణాపాయ స్థితి లేదని, కంటి చూపుపై ఆందోళన చెందాల్సిందేమీ లేదని వైద్యులు చెప్పినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మరో రెండు, మూడు వారాల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News