Revanth Reddy: రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నారు: గుత్తా సుఖేందర్ ఎద్దేవా

  • రేవంత్‌రెడ్డి ఉత్తరకుమారుడిలా మిగిలిపోతాడు
  • పార్టీలోని లుకలుకలు సరిదిద్దుకోవడానికే సమయం చాలదు
  • 1956 నుంచి ఏపీ కృష్ణా జలాలను దోచుకుంటోంది
Gutta Sukender Reddy On Revanth Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తానన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డివి పగటి కలలేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నల్గొండలో నిన్న ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు.

పార్టీలోని లుకలుకలు సరిదిద్దుకోవడానికే రేవంత్‌కు సమయం సరిపోదని, ఇక పార్టీని అధికారంలోకి ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఉత్తర కుమారుడిగా మిగిలిపోతారని అన్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి జరిగిన జలదోపిడీని వ్యతిరేకించినట్టు చెప్పారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీటిని 1956 నుంచి ఏపీ దోచుకుంటూనే ఉందని ఆరోపించారు. ఇప్పుడు జగన్ కూడా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను తరలించుకుపోవాలని చూస్తున్నారని సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు.

More Telugu News