Anandaiah: మా మందుకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు .. బాధాకరం: ఆనందయ్య

  • మందు పంపిణీ కోసం లేఖ రాసినా స్పందన రాలేదు
  • పార్టీలతో సంబంధం లేకుండా మందు అందిస్తున్నాం
  • మందును అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
AP government not cooperating says Anandaiah

కరోనా కోసం తాము తయారు చేస్తున్న మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు బాధాకరమని అన్నారు. మందు పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ... సరైన స్పందన రాలేదని చెప్పారు. మందు తయారీకి సరైన సామగ్రి సమకూరకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అందుకే మందు తయారీలో వెనుకబడ్డామని తెలిపారు. అయినా పలువురు దాతలు అందిస్తున్న సహకారంతో ప్రజలకు మందును అందిస్తున్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా మందును అందిస్తున్నామని తెలిపారు.

బడ్డీ బంకుల్లో తమ మందును అమ్ముతున్నారని... అది ప్రభుత్వ లోపమేనని ఆనందయ్య అన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా బాధితులందరికీ కరోనా మందును ఉచితంగా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధుల ద్వారా మందును అందజేస్తున్నామని తెలిపారు. ఏయే జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయో... ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకుని తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

More Telugu News