Telangana: కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ తెలంగాణ కేబినెట్

  • కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ ఆధునికీక‌ర‌ణ‌కు ఆమోదం
  • ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని నిర్ణ‌యం
  • టిమ్స్ దవాఖానాను సూపర్ స్పెషాలిటీ దవాఖానాగా అధునికీకరణ‌
  • ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం  
telangana cabinet decisions

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునికీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానాను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానాగా ఆధునికీకరించాలని, దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించి, మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది.

వీటిలో చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో ఒకటి, ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మూడవది. టిమ్స్ ను కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో గత సంవత్సరం వరి ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పైచిలుకుగా ఉందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ఈసారి ఇప్పటికే ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయని, గత సంవత్సరం కంటే 5 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యిందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు వివరించింది.
 
గత సంవత్సరంలో పండిన వరిధాన్యంలో 1.4 కోట్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, 1.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు కొన్నారని, సొంత అవసరాల కోసం ప్రజలు ఉపయోగించుకున్నారని, మార్కెటింగ్ శాఖ వివరించింది. ఈ వానాకాలం ఇప్పటికే రైతుబంధు పైసలు, 5145 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమయ్యాయని వ్యవసాయ శాఖ తెలిపింది.
 
ప్రభుత్వ ఆదేశాల మేరకు, కరోనా కష్టకాలంలో కూడా ధాన్యం సేకరణను రికార్డు స్థాయిలో జరిపిన పౌర సరఫరా, గ్రామీణాభివృద్ధి మరియు సంబంధిత శాఖల అధికారులను సిబ్బందిని కేబినెట్ అభినందించింది.
 
గొర్ల పెంపకం వృత్తిలో వున్న యాదవులకు గొర్ల పెంపకం పథకాన్ని తిరిగి ప్రారంభించాలని, క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణులకోసం, గతంలోనే నిర్ణయించిన ప్రకారం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను గ్రామాల్లో తక్షణమే ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
 
గీత కార్మికులకు, చేనేత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సివున్న ఎక్స్ గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కార్పోరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది.
 
రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

More Telugu News