Jagan: వాహనమిత్ర పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కార్య‌క్ర‌మం ప్రారంభించిన సీఎం జ‌గ‌న్!

  •  ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు ల‌బ్ధి
  •  రూ.10 వేల చొప్పున న‌గ‌దు
  •  మొత్తం రూ.248.47 కోట్ల జమ
jagan launches vahana mitra scheme

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్య‌క్ర‌మాన్ని తాడేపల్లిలోని త‌న‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి  సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ సొంతంగా కలిగి ఉండి వాటిని నడిపే డ్రైవర్లకు వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద రూ.10 వేల చొప్పున అందిస్తున్నారు.

కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జ‌గ‌న్ మొత్తం రూ.248.47 కోట్లను జమ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ..  వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర అమలు చేశామని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల ముందు డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూశానని, అందుకే ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టానని చెప్పారు.

కరోనా సంక్షోభ ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో ఈ ఏడాది నెల రోజుల ముందుగానే  వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ హయాంలో మాత్రం ఆటో, క్యాబ్ డ్రైవర్లను పెనాల్టీలతో వేధించార‌ని ఆరోపించారు. తాము 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదు జమ చేస్తున్నామని వివ‌రించారు. 2.48 లక్షల మందిలో 84 శాతం మంది పేదవర్గాల వారే ఉన్నారని చెప్పారు.

ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటోన్న ప్ర‌భుత్వం దేశంలో ఏపీ ఒక్కటేనని అన్నారు. ఆర్థిక సాయం, వాహన బీమాతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌, రిపేర్ల కోసం రూ.10 వేలు ఇస్తున్నామని వివ‌రించారు. బీమా వ‌ల్ల‌ వాహనంలో ప్రయాణించే వారికి కూడా భద్రత ఉంటుందని చెప్పారు. ఈ ప‌థ‌కం దరఖాస్తుల‌కు మరో నెలపాటు గడువు ఉందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని తెలిపారు.

More Telugu News